ఆర్టీసీ కార్మికులకు సీపీఐ మద్దతిస్తుంది

– టీఆర్‌ఎస్‌కు మద్దతు రాజకీయపరమైన నిర్ణయం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : కార్మికులకు నష్టం జరుగుతుంటే సీపీఎం చూస్తూ ఊరుకోదని, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు పూర్తిగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హజూర్‌ నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు
మద్దతిస్తుండటాన్ని, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ముడిపెట్టవద్దని చాడ వెంకట రెడ్డి సూచించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతనేది రాజకీయపరమైన నిర్ణయమని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు పలుకుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలతో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో ఉందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. కేసీఆర్‌ మొండి వైఖరిని వీడాలని, సరైన దిశగా ఆలోచించాలని సూచించారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, అందువల్ల ఇక్కడి ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారని అన్నారు. వారిలో ఎంతో ఆవేదన ఉందని అన్నారు. కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే తమ పార్టీ ఊరుకోదని చెప్పారు. అరెస్ట్‌ చేసిన ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. లేకుంటే కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆందోళన చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని, కార్మికుల సంక్షేమమే సీపీఐ మొదటి ప్రాధాన్యత అన్నారు.