ఉద్రిక్తంగా మారిన ‘ఛలో అసెంబ్లీ’

– బీసెంట్‌ రోడ్డులో ఉపాధ్యాయుల ధర్నా
– అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
– ఉపాధ్యాయుల అరెస్టుపై మండలిలో మండిపడ్డ ఎమ్మెల్సీలు
విజయవాడ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు బీసెంట్‌ రోడ్డులో ధర్నాకు పూనుకున్నారు. దీంతో ఆందోళన ఉదృతమవుతున్న క్రమంలో ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా ఏపీలోని 13జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడలోని యూటిఎఫ్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద ప్యాప్టో చైర్మన్సహా పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులను అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలనుండి లక్షా ఎనభైవేల మంది రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు
పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగులను దొంగలు, దోపిడీ దారుల మాదిరిగా ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి బైండోవర్‌ చేయడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయకపోతే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఉపాధ్యాయుల అరెస్టుపై భగ్గుమన్న ఎమ్మెల్సీలు ..
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు భగ్గుమన్నారు. ఉపాధ్యాయుల అరెస్టులు ఆపేవరకు సభను జరగనివ్వమంటూ మండలిలో నినాదాలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నిరసనతో మండలిలో గురువారం గందరగోళం నెలకొంది. సీపీఎస్‌ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం తీరు, ఉపాధ్యాయుల అరెస్టు తదితర అంశాలపై నిరసన వ్యక్తం చేస్తూ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మండలి హాల్‌లో బైఠాయించారు.
రాత్రి నుంచి ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా? అని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులను వెనక్కి తీసుకోవాలని, అరెస్టులను ఆపాలంటూ మండలి చైర్మన్‌తో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సీపీఎస్‌ విషయంలో తమ  సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. దీంతో కల్పించుకున్న మండలి డిప్యూటీ చైర్మన్‌.. సీపీఎస్‌ అంశంపై చర్చకు శుక్రవారం అనుమతి ఇస్తామని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలకు హావిూ ఇచ్చారు. దీంతో శాంతించిన పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఆందోళన విరమించారు.