ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇదిగో.. నీ అవినీతి చిట్టా

– శిఖం భూములు,గుడిని మింగేశావ్‌

– బహిరంగంగా బండారం బయటపెట్టిన కలెక్టర్‌ దేవసేన

జనగాం,సెప్టెంబర్‌ 26,(జనంసాక్షి): గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య నెలకొంటున్న వివాదాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పాలనాపరంగా వారికి అడ్డుతగులుతున్నారని, అవసరమైతే బదిలీ వేటు వేస్తున్నారని ఎమ్మెల్యేలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా కలెక్టర్‌ దేవసేనకు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి మధ్య కొనసాగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అక్రమాలను ఇంత కాలం ఒపిక పట్టానని, ఇకపై ఏమాత్రం సహించేది లేదన్న కలెక్టర్‌ సిఎం కెసిఆర్‌కు సైతం వివరించాలని చూస్తున్నట్లు సమాచారం. తాజాగా బతుకమ్మ కుంట వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి విూడియా సాక్షిగా ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు ఐదెకరాల కుంటను పూడ్చినట్లు ఎమ్మెల్యే వర్గంపై కలెక్టర్‌ దేవసేన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, అభివృద్ది పేరు చెప్పి డబ్బులు ఎలా వసూలు చేసిందీ? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాన్ని విూడియాకు పూసగుచ్చినట్లు ఆమె వివరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరును దేవసేన చెప్పుకొచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే ఓ గుడిని కూడా తన పేరిట రిజిస్టేష్రన్‌ చేయించు కున్నాడని, దాన్ని తానే రద్దు చేశానని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంట ప్రదేశం వివాదాస్పద స్థలంగా ఉండటంతోనే అక్కడ వేడుకలు నిర్వహించట్లేదని కలెక్టర్‌ దేవసేన తెలిపారు. కాగా, ఈ స్థల వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కలెక్టర్‌ గతంలోనే డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారంట. అయినా సరే! పెద్దగా చర్యలేవీ లేకపోవడంతో.. తానే స్వయంగా ఆయన అక్రమాల గురించి విూడియాకు వెల్లడించినట్లు అర్థమౌతోంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.