ఏనుగుల బీభత్సంతో గ్రామస్థుల ఆందోళన

విజయనగరం,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఏనుగుల బీభత్సానికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా లోని కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంటల పొలాల్లోకి వచ్చిన గజరాజులు పంటను నాశనం చేశాయి. ఏనుగుల గుంపు బీభత్సంతో గ్రామానికి చెందిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఏనుగుల దాడిలో రఘు మండల లక్ష్మి నాయుడు(50) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో కూడ ఏనుగుల దాడికి కొంతమంది మృతి చెందగా, మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఏనుగులను దూరంగా తరిమేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.