ఐక్యతా విగ్రహం లిఫ్ట్లో సాంకేతిక లోపం
ఇరుక్కుపోయిన బీహార్ ఉప ముఖ్యమంత్రి
గాంధీనగర్,నవంబర్14(జనంసాక్షి): ఇటీవల ఆవిష్కరించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం లిఫ్టులో బీహార్కు చెందిన ఇద్దరు మంత్రులు ఇరుక్కుపోయారు. ఐక్యతా విగ్రహాన్ని బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ మంగళవారం సందర్శించారు. అయితే ఆ సమయంలో సుశీల్ మోదీ ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఐక్యతా విగ్రహం లిఫ్టులో ఆయన రెండు సార్లు ఇరుక్కుపోయారు. అక్టోబరు 31న గుజరాత్లో అతిపెద్ద పటేల్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. 182 విూటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహంలో 152 విూటర్ల ఎత్తులో పటేల్ ఫొటోలతో ఓ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. లిఫ్టు ద్వారా ఈ గ్యాలరీలోకి వెళ్లాలి. గ్యాలరీకి వెళ్లేందుకు సుశీల్ మోదీ, గుజరాత్ మంత్రి సౌరభ్ పటేల్, ఇతర ప్రభుత్వ అధికారులు, భద్రతా సిబ్బంది, విూడియా వ్యక్తులు లిప్ట్ ఎక్కారు. అయితే ఓవర్లోడ్ అవడంతో గ్రౌండ్ ప్లోర్లోనే లిప్ట్ కదలకుండా ఆగిపోయింది. లిప్ట్ తలుపు మూసుకుపోవడంతో వారంతా అందులో చిక్కుకుపోయారు. అప్రమత్తమైన సిబ్బంది టెక్నీషియన్ల సాయంతో లిప్ట్ తలుపులను తెరిచి కొందరు విూడియా సిబ్బందిని దించేశారు. ఆ తర్వాత లిప్ట్ బయల్దేరింది. అయితే కొంత పైకి వెళ్లాక మరోసారి ఆగిపోయింది. నిమిషం పాటు ఆగిపోయి మళ్లీ బయల్దేరింది. ఇలా సుశీల్ మోదీ తదితరులు రెండు సార్లు లిఫ్టులో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. కాగా.. ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించిన నాటి నుంచి అందులోని లిప్ట్ పనిచేయకపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే లిప్ట్ పనిచేయలేదు. దీంతో గ్యాలరీకి వెళ్లిన దాదాపు 200 మంది పర్యటకులు మెట్ల దారి ద్వారా కిందకు వచ్చారు.