కంటివెలుగుపై ఊరూరా ప్రచారం

 

కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు

మహబూబాబాద్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రజలు తప్పనిసిరిగా వచ్చి పరీక్షలు చేయించుకునే గ్రామాలో దండోరా వేయనున్నారు. దీనిపై కలెక్టర్‌ శివలింగయ్య ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి జనవరి 26వ తేదీ వరకు జిల్లాలో 7,74,549 మందికి కంటి పరీక్షలను ఉచితంగా చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మండల పీహెచ్‌సీ, మున్సిపల్‌లో వార్డుల్లో క్యాంపులు నిర్వహించాలని, మండల, గ్రామస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పీహెచ్‌సీ సేవలకు ఆటంకం కలుగకుండా కంటివెలుగు శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్యాంపులు నిర్వహించాలన్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ, మండల ప్రత్యేక అధికారులతో ఏర్పాట్లపై సవిూక్షించారు. వైద్యాధికారులు సమష్టిగా పని చేయాలని సూచించారు. మండలాలు, పీహెచ్‌సీల వారీగా సంబంధిత వైద్యులతో పరీక్ష కేంద్రాల్లోప్రజలకు నేత్ర వైద్య సేవలు అందించాలన్నారు. కంటివెలుగు పరీక్ష కేంద్రాల్లో మెడికల్‌ టీం లీడర్‌ ముందస్తు సౌకర్యాలు కల్పించాలన్నారు. రోజుకు ఒక్కో టీం 260 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సరిపడా కళ్లద్దాలు అందుబాటలో ఉన్నాయని, మహబూబాబాద్‌ అర్బన్‌లో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

————————