కడుపునొప్పితో వచ్చిన వ్యక్తి మృతి

ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన
హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): కడుపునొప్పితో వచ్చిన వ్యక్తిని ఆసుపత్రి కాటికి పంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కడుపు నొప్పితో బాధపడుతున్న మల్లేష్‌ గౌడ్‌ చక్కగా నడుచుకుంటూ చికిత్స నిమిత్తం యశోదా ఆసుపత్రికి వెళ్లారు. మంచిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి వైద్యులు ఇంజక్షన్‌ ఇచ్చారు. అంతే గంట లోపే మల్లేష్‌ గౌడ్‌ మృతి చెందాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించడం వల్లనే చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీసీ ఫుటేజిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో హాస్పిటల్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.