కరోనా టీకా ట్రయల్స్‌ వేసుకున్నా ఆగని కరోనా

హర్యానా ఆరోగ్య శాఖ మంత్రికి పాజిటివ్‌ నమోదు
న్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ టీకా ట్రయల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైరస్‌ సోకింది.  ఉదయం తన ట్విట్టర్‌లో మంత్రి అనిల్‌ విజ్‌ ఈ విషయాన్ని తెలిపారు.  కోవిడ్‌19 పరీక్షలో పాజిటివ్‌ తేలినట్లు ఆయన వెల్లడించారు.  వాస్తవానికి నవంబర్‌ 20వ తేదీన మంత్రి అనిల్‌.. కోవాగ్జిన్‌ టీకాను తీసుకున్నారు.  అంబాలా హాస్పిటల్‌లో జరిగిన మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్‌ విజ్‌.. వాలంటీర్‌ రూపంలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.  హైదరాబాద్‌కు చెందిన భారత్‌బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తున్న
విషయం తెలిసిందే.