కర్ణాటకలో ఎలాంటి సంక్షోభంలేదు : జగదీశ్‌ షెట్టర్‌

న్యూఢిల్లీ : కర్ణాటకలో ఇద్దర మంత్రుల రాజీనామాతో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌ ఈ ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. పార్టీకి నూతన అధ్యక్షుడిగా  ఎన్నికైన రాజ్‌నాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేదని.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారని అధ్యక్షునికి తెలిపినట్లు చెప్పారు. భాజపా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని.. బలం నిరూపించుకోవాలని ఎవరూ అడగలేదని చెప్పారు. అనంతరం రాజ్‌నాధ్‌ సింగ్‌ మాట్లాడుతూ కర్ణాటకలో భాజపా సర్కార్‌కు మెజారిటీ ఉందని.. ఎలాంటి సంక్షోభం లేదని తెలిపారు. మరోవైపు గత వారంలో రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులు ఉదాసీ, శోభా కరందాల్‌జీ యడ్యూరప్ప పార్టీలో చేరనున్నట్లు సమాచారం తెలిసింది.