కర్ణాటకలో కళాశాలల వద్ద 144 సెక్షన్‌


` హిజాబ్‌ వివాదం ధర్మాసనానికి బదిలీ
బెంగళూరు,ఫిబ్రవరి 9(జనంసాక్షి): కర్ణాటకను హిజాబ్‌ వస్త్రధారణ వివాదం కుదిపేస్తోంది. ఈ వివాదం కారణంగా నిన్న పలు ప్రాంతాల్లో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ పరిస్థితులు సద్దుమణగలేదు. బుధవారం కళాశాలల వద్ద విద్యార్థులు హిజాబ్‌, కాషాయ కండువాలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు వ్యాప్తంగా విద్యాసంస్థల వద్ద ఆందోళనలపై నిషేధం విధించింది. ‘‘బెంగళూరులోని స్కూళ్లు, కాలేజీ గేట్ల నుంచి 200 విూటర్ల పరిధిలో ఎలాంటి సమూహాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి లేదు. వీటిపై రెండు వారాల పాటు నిషేధం విధిస్తున్నాం’’ అని పోలీసు శాఖ వెల్లడిరచింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యాసంస్థల వద్ద ఫిబ్రవరి 22 వరకు సెక్షన్‌ 144 విధిస్తున్నట్లు తెలిపింది.
కేసు విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ
మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత న్యాయస్థానంలోని ఏకసభ్య ధర్మాసనం నిన్న విచారణ జరిపింది. అయితే నేడు మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడిరచింది. హిజాబ్‌ ధరిస్తే పాఠశాలలకు అనుమతించకపోవడంపై ఐదుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులు తమ నమ్మకాలను పాటిస్తూనే స్కూళ్లకు వెళ్లేలా తాత్కాలిక ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. విద్యార్థులందరూ డ్రెస్‌కోడ్‌ను పాటించాల్సిందేనని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏకసభ్య ధర్మాసనం.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది