కర్ణాటకలో ఘోరం

కాలువలోకి దూసుకెళ్లిన బస్సు..

20 మంది జలసమాధి

హూబ్లీ: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల చిన్నారులే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 20 మంది మృతిచెందారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాలువలోకి దూసుకెళ్లగానే బస్సు పూర్తిగా మునిగిపోయింది. దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీశారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.