కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

– ఆరుగురు దుర్మరణం

బెంగళూర్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : కర్ణాటకలోని హుబ్బళ్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్బళ్లి సవిూపంలోని 63వ నెంబరు జాతీయ రహదారిపై ప్రయాణీకులతో వెళ్తోన్న బస్సు, లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముంబైకి చెందిన ఆరుగురు పర్యాటకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వైద్యం కోసం హుబ్బళ్లిలోని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతులను ముంబయికి చెందిన విశ్వనాథ్‌ (76), దినకర్‌ (74), రమేశ్‌ జైపాల్‌ (70), సుమేధా (65), లహూ, సుచిత్ర (65)లుగా గుర్తించారు. వీరంతా హంపీకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత వాహనాలు జాతీయ రహదారికి అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్ల సాయంతో వాటిని తొలగించి, వాహనాలు రాకపోకలను పునరుద్దరించారు. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్దరించారు. ప్రమాదంలో మృతిచెందిన వారంతా సీనియర్‌ సిటిజన్స్‌ కావడం గమనార్హం. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొనే రాష్ట్రాల్లో కర్ణాటక ముందు వరుసలో ఉంది. 2016లో 44,403 ప్రమాదాలు చోటు చేసుకోగా, 11,133 మంది మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే జరిగిన 5,323 ప్రమాదాల్లో 790 మంది ప్రాణాలు కోల్పోయారు.