కర్నూలులో ఘోర రోడ్డుప్రమాదం


– ముగ్గురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
– కడపలో జగన్‌ సభకు వెళ్తుండగా ఘటన
– మృతులంతా కోట్ల హర్షవర్దన్‌రెడ్డి అనుచరులు
కర్నూలు, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కోడుమూరు నుంచి కడపకు బయల్దేరగా ఓర్వకల్లు సవిూపంలోకి రాగానే వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం గురించి తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా వీరంతా వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్‌ రెడ్డి తాను వైసీపీలో చేరుతున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైసీపీలో చేరేందుకు తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో ఆయన కడపకు వెళ్తుండగా అపశ్రుతి చోటు చేసుకుంది. హర్షవర్ధన్‌ రెడ్డి కడపకు గురువారం ఉదయం బయలుదేరిన అనతరం ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌ సవిూపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌ వద్దకు రాగానే అదే మార్గంలో వెళ్తున్న లారీ వెనుక నుంచి కాన్వాయ్‌లోని కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంచలింగాలకు చెందిన డ్రైవర్‌ రాఘవేంద్ర, నిర్మల్‌నగర్‌కు చెందిన బి. రాము, చిన్ని రాముడు అక్కడికక్కడే మృతి చెందారు. దేవనకొండ మండలం ఈదుల దేవరబండకు చెందిన లింగన్న, నిర్మల్‌నగర్‌కు చెందిన పరశురాం, లక్ష్మన్నలకు గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతిచెందిన రాము, చిన్ని రాముడు బావ, బావమరదులు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని వైద్యం కోసం సవిూపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.