కాంగ్రెస్ జాబితాపై నరాలు తెగే ఉత్కంఠ
రెండుసార్లు రాహుల్తో భేటీలో చర్చించిన కుంతియా, ఉత్తమ్
జాబితాపై మరోమారు ఆరా తీసిని రాహుల్
నేడు జాబితా విడుదల కానుందన్న ఆశాభావం
న్యూఢిల్లీ,నవంబర్12(జనంసాక్షి): మహాకూటమి సీట్ల వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాహుల్ గాంధీ నివాసంలో రెండు దఫాలుగా సమావేశమైనా సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వం మొదలైన కాంగ్రెస్ కసరత్తు తుదితశకు చేరుకోలేదు. ఇప్పటివరకు ఖరారు చేసిన జాబితాపై ఎఐసిసి అఅధ్యక్షుడు రాహుల్ ఆరా తీసినట్లు సమాచారం. మరోవైపు
జాప్యానికి కారణం కాంగ్రెస్సేనని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. 4 స్థానాలు ఇవ్వాల్సిందేనని చాడ వెంకట్రెడ్డి పట్టుబడుతున్నారు. కొత్తగూడెం సీటు తమదేనని సీపీఐ చెబుతోంది. దీంతో తెలంగాణలో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఇంకా సందిగ్ధత వీడలేదు. మరోవైపు అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యంపై పార్టీ అధినేత రాహుల్గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉత్తమ్, కుంతియా, భక్తచరణ్దాస్తో రాహుల్గాంధీ భేటీ అయ్యారు. ఖరారైన, ఖరారవ్వని స్థానాల జాబితాలను రాహుల్ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన వారిలో ఎందరికి సీట్లిచ్చారు.. సామాజికకోణం, కుటుంబపరంగా సీట్లు కేటాయింపులు, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారన్న అంశాలపై రాహుల్ గాంధీ ఆరా తీయనున్నట్లు సమాచారం. దీంతో జాబితాలో కొందరు టిఆర్ఎస్ కోవర్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న రాహుల్ జాబితాపై మళ్లీచర్చించారని సమాచారం. అందుకే జాబితా ఆలస్యం అయ్యిందని అంటున్నారు.వరుసగా మూడు సార్లు ఓడిపోయారా, మూడు నెలల క్రితమే పార్టీలో చేరారా, గత ఎన్నికల్లో 50వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారా ఇలాంటివన్నీ త్రిసభ్య కమిటీ సేకరించడంతో కొంత మంది సీనియర్లలో, ఇటీవల వలస వచ్చిన వారిలో గుబులు రేగుతోంది. కుటుంబానికి ఒక్క టికెట్ విషయంలో మినహాయింపులు రాని వారు, అంతగా ప్రజాదరణ లేని వారు ఇటీవల పార్టీలో చేరిన వారికి సంబంధించి ఏఐసీసీ మార్గదర్శకాలు తూ.చా తప్పకుండా అమలైతే అభ్యర్థులు జాబితాలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో కౌంట్డౌన్ ఆరంభమైంది. పోలింగ్కు ఇంకా 25 రోజులే ఉంది. నామినేషన్ల స్వీకరణ పక్రియ కూడా మొదలైంది. దీంతో ప్రధాన పార్టీల్లో కౌంట్డౌన్ టెన్షన్ పెరిగిపోతోంది. అసెంబ్లీని రద్దు చేస్తూనే అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. అటు మిషన్ 70 అంటున్న బీజేపీ కూడా క్యాంపెయిన్ జోరు పెంచింది. కానీ టీఆర్ఎస్ను గ్దదె దించుతామంటున్న మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కూటమికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్లో సీట్ల సర్దుబాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ శ్రేణుల్లో కలవరం నిమిషనిమిషానికి ఎక్కువైపోతోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు జాబితాలను ఓకే చేసింది. కానీ అందులోని అభ్యర్థుల పేర్లను ఇంత వరకు ప్రకటించలేదు. ఇంతలోనే మళ్లీ ఎంపిక చేసిన జాబితాలోని పేర్లపై పున:పరిశీలన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు. దాంతో పాటే పాత జాబితాలోని పది పేర్లను మళ్లీ సవిూక్షించనుంది. దీంతో కాంగ్రెస్ జాబితా సోమవారం కూడా వెల్లడయ్యే అవకాశాలు లేవన్న వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పడే ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో కూటమిలో కొన్ని సీట్లపై టీడీపీ, కాంగ్రెస్ మధ్య పంచయతీ తేలడం లేదు. అలాగే టీజేఎస్, సీపీఐ కూడా తమకు కావాల్సిన సీట్ల కోసం పట్టుబడుతున్నాయి.చ్చితంగా టికెట్ తమకే వస్తుందన్న ధీమా ఎంత ఉన్నా కూటమి పొత్తులు, సీట్ల సర్దుబాటులో చివరి నిమిషంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన అభ్యర్థుల్లో ఎక్కువైపోతోంది. తొలి విడతలో 54, రెండో విడతో 20 ఇలా 74 స్థానాలకు అభ్యర్థులను ఓకే చేసింది ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ. వీటిలో కొన్నింటిపై కాంగ్రెస్ హైకమాండ్ పున:పరిశీలన చేయనుంది . పెండింగ్లో ఉన్న 20 స్థానాలతో పాటు పున:పరిశీలన అంశం ఆశావాహుల్లో ఉత్కంఠ పెంచేస్తోంది. దీనిపై భక్తచరణ్దాస్ నేతృత్వంలోని త్రిసభ్య స్క్రీనింగ్ కమిటీ కూడా ఆశావాహులకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించింది. స్క్రీనింగ్ కమిటీ ఓకే చేస్తేనే కానీ అభ్యర్థులపై స్పష్టత రాదు. ఈ రాత్రికి ఢిల్లీలో భేటీ ముగిసి
ఒకే చేసినా మంగళవారం ఉదయమే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టికెట్ డిమాండ్ చేస్తూ ఇటు గాంధీభవన్, అటు హస్తినలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీలను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ మంత్రాన్ని కాంగ్రెస్ ప్రయోగిస్తోంది. మరోవైపు ఇసీ నోటిఫికేషన్తో నామినేషన్ల పక్రియ ఆరంభమైంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసారు.