కాంగ్రెస్ వారికి సోనియానే మదర్
బిజెపికి మాత్రం దేశమే భారతమాత
ఎన్నికల ప్రచారంలో సిఎం వసుంధరరాజె
జైపూర్,నవంబర్24(జనంసాక్షి): రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని తల్లిగా బీజేపీ భావిస్తే, కాంగ్రెస్కి మాత్రం తల్లి సోనియాగాంధీ అంటూ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కంటే కుటుంబ పాలనను ప్రోత్సహించడానికే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ జరిగిన ర్యాలీలో వసుంధరా రాజే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి మదర్ ఇండియా కంటే సోనియాగాంధీనే ఎక్కువని అన్నారు. దేశం కంటే కుటుంబ ఆరాధనకే ఆ పార్టీ కట్టుబడి ఉందంటూ విమర్శించారు. బికనీర్లో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత ఒకరు కార్యకర్తలను ‘భారత్ మాతా కీ జై’ నినాదానికి బదులు ‘సోనియాగాంధీ కీ జై’ అనే నినాదాలు ఇవ్వాల్సిందిగా కోరినట్టు వచ్చిన ఆరోపణలపై సీఎం స్పందిస్తూ తాజా వ్యాఖ్యలు చేశారు. టాంక్, బుంది, బన్స్వారా, ఛిత్తోర్గఢ్ జిల్లాలో వసుంధర సుడిగాలి ప్రచారం సాగించారు. కాంగ్రెస్ గత 50 ఏళ్లుగా కులాల మధ్య విభజన సృష్టిస్తూ వచ్చిందిని, రాజస్థాన్లో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలే బీజేపీని మళ్లీ గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.