కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తుమ్మల

హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ చీప్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే కాంగ్రెస్‌ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. తుమ్మల చేరిక కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కేసీ వేణుగోపాల్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తుమ్మలతో పాటే ఆయన అనుచరులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కీలక నేతలు కూడా మరి కొద్ది రోజుల్లోనే హస్తం గూటికి వచ్చే ఛాన్స్‌ ఉంది. తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చే ఛాన్స్‌ ఉందని పార్టీ వర్గాలు టాక్‌. నాగేశ్వరరావు గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి ఇప్పటికే అప్లికేషన్‌ పెట్టుకున్నారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ట్రై చేస్తుంది. ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలం మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను చక్రం తిప్పడంలో తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. తుమ్మలకు బలమైన క్యాడర్‌ కూడా ఉండటంతో మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో టీడీపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టారు. అభివృద్ధి పనులపైనే ప్రధానంగా నజర్‌ పెట్టి జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో తుమ్మల నాగేశ్వరరావు ప్రభావంతో కాంగ్రెస్‌కు మరిన్నీ సీట్లు పెరిగే ఛాన్స్‌ ఉందని కాంగ్రెస్‌ అధిష్ఠానం అంచనా వేస్తోంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణంలోని కమ్మ సామాజిక వర్గ ఓట్లను కూడా తుమ్మల ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రూపంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుండగా.. ఇప్పుడు తుమ్మల కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీన పడవచ్చని రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.