కిటెక్స్‌కు అంకురార్పణ

` తెలంగాణ రాష్ట్రంలో 1200 కోట్ల తయారీ కేంద్రానికి శ్రీకారం
` క్లస్టర్‌ ఏర్పాటు ద్వారా ప్రతిరోజూ 7 లక్షల దుస్తులు ఉత్పత్తి
` శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌
` అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి
హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో భారీ తయారీ యూనిట్‌కు కిటెక్స్‌ సంస్థ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో కిటెక్స్‌ సంస్థ తన ఇంటిగ్రేటెడ్‌ ఫైబర్‌ టు అప్పారెల్‌ తయారీ క్లస్టర్‌ కోసం మంత్రి కే తారక రామారావు, కిటెక్స్‌ సంస్థ చైర్మన్‌ సాబు జేకబ్‌తో కలిసి గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. కిటెక్స్‌ సంస్థ తన తయారీ క్లస్టర్‌ కోసం 1200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతున్నది. ఈ క్లస్టర్‌ ఏర్పాటు తర్వాత ప్రతిరోజు ఏడు లక్షల దుస్తులను కిటెక్స్‌ సంస్ధ ఉత్పత్తి చేయనున్నది. వచ్చే సంవత్సరం డిసెంబర్‌ నాటికి తయారీ కేంద్రం నిర్మాణం పూర్తి అవుతుందని, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కిటెక్స్‌ సంస్థ తెలిపింది. కిటెక్స్‌ సంస్థ ఇప్పటికే తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్‌ పార్కులో తన భారీ తయారి యూనిట్‌ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నది. ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి వరంగల్‌ కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు కిటెక్స్‌ సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో తన పెట్టుబడులను భారీగా విస్తరించి, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిన కిటెక్స్‌ సంస్థకి మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కిటెక్స్‌ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని కేటీఆర్‌ తెలిపారు. కిటెక్స్‌ సంస్ధ తయారీ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా రోజువారీగా ప్రపంచంలోనే అత్యధిక దుస్తులను ఉత్పత్తి చేస్తున్న తయారీ ప్లాంట్‌ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తులో నిలుస్తుందని కేటీఆర్‌ అన్నారు.
350 కోట్ల సింటెక్స్‌ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు వెల్సన్‌ సంస్థ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తన సబ్సిడరీ సంస్థ అయిన సింటెక్స్‌ తయారీ యూనిట్‌కు మంత్రి కే తారక రామారావు, వెల్సన్‌ వరల్డ్‌ చైర్మన్‌ బి కే గోయోంకా సమక్షంలో గురువారం శంకుస్థాపన చేశారు. సింటెక్స్‌ సంస్థ 350 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ యూనిట్‌ వల్ల వెయ్యి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. సింటెక్స్‌ సంస్థ తన తయారీ యూనిట్‌ ద్వారా వాటర్‌ ట్యాంకులను, యూపీవీసీ పైపులు, ఇతర అనుబంధ ఉత్పత్తులను ఉత్పత్తి చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, అద్భుతమైన మౌలిక వసతుల వల్లనే అనేక సంస్థలు తమ కార్యకలాపాలను రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమలు, సంస్థల విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతును అందిస్తుందని, తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఆయా సంస్థలు మరింత వృద్ధి సాధించాలని తాము కోరుకున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామని వెల్సన్‌, వరల్డ్‌ చైర్మన్‌ బి కే గోయాంక తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల నిర్వహణ పట్ల పూర్తి సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, ఈరోజు సింటెక్స్‌ సంస్థ యూనిట్‌ ద్వారా పివిసి పైపులు, వాటర్‌ ట్యాంకుల వంటి ఉత్పత్తులను మార్కెట్‌ చేయడంలో తమ సంస్థ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ యూనిట్‌ ద్వారా తమ సంస్థ తరఫున మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు.