కులగోత్రాలు వెల్లడించిన రాహుల్‌

బ్రహ్మ ఆలయంలో తెలిపారని సమాచారం

జైపూర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ తన కుల, గోత్రాలను వెల్లడించారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్న రాహుల్‌.. పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించిన రాహుల్‌.. తన కుల, గోత్రాలను వెల్లడించారు. పూజారి అడిగిన సమయంలో తనది దత్తాత్రేయ గోత్రమని, కౌల్‌ బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందినట్లు రాహుల్‌ తెలిపారు. పూజ సమయంలో తన పితృమూర్తుల కులగోత్రాలను కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. బ్రహ్మ ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు. అంతకుముందు స్థానిక నేతలు రాహుల్‌కు కాషాయం కండువాను కట్టారు. టెంపుల్‌ రిజస్టర్‌లో జై హింద్‌, వందేమాతం అని కూడా రాశారు. పితృదేవతలకు తర్పణం ఇస్తున్న సమయంలో అక్కడ ఉన్న జనం జై శ్రీరామ్‌ అని నినాదాలు చేశారు. బ్రహ్మ ఆలయాన్ని గతంలో మాజీ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీలు కూడా విజిట్‌ చేశారు. ఇటీవల రాహుల్‌ చాలా వరకు ఆలయాలను సందర్శించారు. దానిలో భాగంగా ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌ బీజేపీ నేతలు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్‌ తన గోత్రం ఏంటో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాహుల్‌ తన గోత్రాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. బ్రహ్మ ఆలయ దర్శనం తర్వాత రాహుల్‌ అజ్మీర్‌లో ఖ్వాజా దర్గాకు కూడా వెళ్లారు. కశ్మీర్‌ పండిట్లు అయిన కౌల్‌ బ్రహ్మణులు శైవారాధకులు.