కేంద్రం చేసిన పనులు..  బాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు

– 24గంటల విద్యుత్‌ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైంది
– ఉపాధి నిధుల్లో వేలకోట్లు దుర్వినియోగమయ్యాయి
– 10శ్వేత పత్రాలు అబద్దాలతో నిండినవే
– కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఎన్టీఆర్‌ స్ఫూర్తి అంటున్నారు!
– బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
అమరావతి, జనవరి30(జ‌నంసాక్షి) : ఏపీకి కేంద్రం అన్ని విధాల సహకారం అందిస్తుందని, కానీ కేంద్రం చేసిన పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్నాడని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
దివంగత నేత ఎన్టీఆర్‌ స్పూర్తితో పాలన జరిగితే కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ నరసింహాన్‌ అసత్యాలు ప్రసంగించారని మండిపడ్డారు. చంద్రబాబు బీసీ కులాలకు ఎక్కడ మేలు చేశారో చెప్పాలన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హావిూ ఎందుకు నెరవేర్చలేదో తెలపాలన్నారు. కేంద్రం చేసిన వాటన్నటినీ చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర సాయం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలు సాధించిందని, 24 గంటల విద్యుత్‌ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వ ప్లాంట్‌లు మూసి ఉత్పత్తి నిలిపేశారని, ఉపాధి హావిూ నిధుల్లో వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. 74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని, కేంద్రం సహకరించడం లేదనడం అవాస్తవమన్నారు. కేంద్ర ప్రభుత్వనిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పథకాలు అమలు చేస్తోందని, రూ.వేల కోట్లు ఇస్తే.. కేంద్రం సహకరించలేదనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
చంద్రబాబు విడుదల చేసిన 10శ్వేత పత్రాలు అబద్దాలతో నిండినవని విమర్శించారు. ఉపాధిహామి పథకంలో భాగంగా రూ. 9 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి ఇచ్చారని, అభివృద్ధి పథకాల అమలులో కేంద్రం భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.