కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దు

 

 


ప్రధాని మోదీకి ప్రియాంక గాంధీ లేఖ
న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి): కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాతో వేదిక పంచుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆమె లేఖ రాశారు. ప్రధాని ఉద్దేశం పారదర్శకమైతే కేంద్ర మంత్రితో వేదిక పంచుకోవద్దని, మంత్రిని పదవి నుంచి సాగనంపాలని ఆమె డిమాండ్‌ చేశారు. డీజీపీ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని శనివారంనాడు లక్నోలో ఉన్నారు. లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా అరెస్టయిన నేపథ్యంలో కేంద్ర మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ మొదట్నించీ డిమాండ్‌ చేస్తోంది.రైతుల విషయంలో విూ ఉద్దేశం స్పష్టంగా ఉంటే హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాతో ఒకే వేదక పంచుకోవద్దు. ఆయనను డిస్మిస్‌ చేయండని ఆ లేఖలో మోదీని ప్రియాంక కోరారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను తమ ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రధాని శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో ప్రియాంక లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్‌ 3న లఖింపూర్‌లో చోటుచేసుకున్న హింసాకాండలో నలుగురు రైతులతో సహా ఎనిమది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు సంబంధించి ఆశిష్‌ మిశ్రా సహా 13 మందిని అరెస్టు చేశారు. అజయ్‌ మిశ్రా వాహనంతో పాటు మూడు వాహానాల కాన్వాయ్‌ రైతుల విూద నుంచి దూసుకుపోవడంతో నలుగురు రైతులు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. లఖింపూర్‌ హింసాత్మక ఘటనలపై దర్యాప్తును పర్యవేక్షించేందుకు పంజాబ్‌, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది.