కేంద్రమంత్రి వాహనం తనిఖీ

పోలీసుల తీరుపై మండిపాటు

తిరువనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌కు శబరిమలలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం తెల్లవారుజామున అయ్యప్ప దర్శనం ముగించుకుని ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కన్యాకుమారి ఎంపీ అయిన ఆయన ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని చివరి వాహనంలో ఆందోళనకారులు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ఆ వాహనాన్ని ఆపేశారు. ఈ ఘటనతో దాదాపు అరగంట పాటు మంత్రి ప్రయాణం ఆలస్యమైంది. తర్వాత మంత్రి కాన్వాయ్‌ వాహనం అని తెలుసుకున్న పోలీసులు దాన్ని వదిలేశారు. ఎస్పీ హరిశంకర్‌ రాతపూర్వకంగా మంత్రి రాధాకృష్ణన్‌కు క్షమాపణలు చెప్పారు. పోలీసుల తీరు వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన నిరసన తెలియజేస్తూ మంత్రి తన వాహనాన్ని వదిలి ప్రజా రవాణా బస్సులో పంబా వరకు ప్రయాణించారు.