కేటీఆర్‌ పోలీసులను దొంగలుగా మార్చారు

– తెదేపా నేత పంచుమర్తి అనురాధ
విజయవాడ, మార్చి5(జ‌నంసాక్షి) : దొంగలను కాపాడేందుకు కేటీఆర్‌ తెలంగాణ పోలీసులను దొంగలుగా మార్చారని టీడీపీ నేత పచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. వైసీపీని గెలిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, తద్వారా జగన్‌ను అడ్డుపెట్టుకొని ఏపీ మూలాలపై ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మైక్రోసాఫ్ట్‌ సహా అనేక ఐటీ కంపెనీలు తీసుకువచ్చి.. హైదరాబాద్‌ను చంద్రబాబు ప్రపంచపటంలో పెట్టారని ఆమె అన్నారు. పోలీసులను దొంగలుగా మార్చి… సాఫ్ట్‌వేర్‌ సంస్థలను కేటీఆర్‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. జగన్‌ అనే దొంగను గెలిపించేందుకు పోలీసులను కేటీఆర్‌ దొంగలుగా మార్చారని అనురాధ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ఎక్కడపడితే అక్కడ కేసులు పెడుతున్నారని, డేటాపై కేసు పెట్టిన లోకేశ్వర్‌రెడ్డి… జగన్‌కు సవిూప బంధువని ఆమె అన్నారు. కంప్యూటర్లను, హార్డ్‌డిస్క్‌లను పోలీసులచే దొంగతనం చేయించిన కేటీఆర్‌.. అమాయకులను అరెస్ట్‌ చేయించారని పంచుమర్తి అనురాధ విమర్శించారు. తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలోచంద్రబాబు 150 సీట్లకు పైగా గెలవబోతున్నారనే భయం జగన్‌కు పట్టుకుందన్నారు. కేటీఆర్‌ ఆత్మ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. కొణతం దిలీప్‌రెడ్డి అనే వ్యక్తి ద్వారా… కేటీఆర్‌ దొంగ సర్వేలు చేయించింది వాస్తవం కాదా? అని ఆమె ప్రశ్నించారు. దిలీప్‌రెడ్డిని అడ్డుపెట్టుకొని 25లక్షల టీడీపీ ఓట్లను తొలగించారని ఆనురాధ ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం భాజపా, కేసీఆర్‌, జగన్‌లు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెబుతారని అనురాధ హెచ్చరించారు.