కేరళ కాలేజీలో పట్టపగలే దారుణం

తోటి విద్యార్థినిని దారుణంగా కోసి చంపిన మృగాడు
తనతో చనువుగా ఉండడం లేదన్న కక్షతో దారుణం
తిరువనంతపురం,అక్టోబర్‌1 (జనం సాక్షి) : కేరళలోనూ ఓ మృగాడు చెలరేగాడు. తనను ప్రేమించడం లేదనో..తనతో రొమాన్స్‌ చేయడం లేదనో కక్షతో తోటి విద్యార్థిని అతడు కత్తితో కోసి చంపాడు. పక్కా ప్లాన్‌తో హతమార్చాడా రాక్షసుడు. పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన విద్యార్థిని దారుణహత్యకు గురైంది.
తోటి విద్యార్థే అమెను అత్యంత కిరాతకంగా గొంతుకోసి హతమార్చాడు. కాలేజీ క్యాంపస్‌లోనే సెక్యూరిటీ సిబ్బంది చూస్తుండగా దారుణం జరిగింది. కొట్టాయం జిల్లా పాలా ఏరియాలోని సెయింట్‌ థామస్‌ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ హృదయవిధారక ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. కొట్టాయం జిల్లా వైకోమ్‌లోని తొలయోలపరంబుకు చెందిన నితినా మోల్‌ (22) సెయింట్‌ థామస్‌ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నది. జిల్లాలోని వల్లచిరకు చెందిన అభిషేక్‌ (22) కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో నితినా మోల్‌ను అభిషేక్‌ తరచూ లైంగిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. తనతో మాట్లాడాలని, రొమాన్స్‌ చేయాలని వేధిస్తూ వస్తున్నాడు. అయితే నితినా అతడిని పక్కనపెడుతూ వచ్చింది. ఈ క్రమం లోనే శుక్రవారం నితినా, అభిషేక్‌ ఇద్దరూ పరీక్షలు రాసేందుకు వచ్చారు. అయితే, నితినాను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్న అభిషేక్‌ పరీక్ష మధ్యలోనే హాల్‌ నుంచి బయటకు వచ్చాడు. క్యాంపస్‌ లోపలే నితినా ఎప్పుడు బయటి వస్తుందా అని ఎదురుచూశాడు. ఇంతలో నితినా రాగానే పేపర్‌ కట్టర్‌ సాయంతో ఆమె గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమైన నితినాను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.