గవర్నర్‌చేత అబద్దాలు చదివించారు

– గవర్నర్‌ ప్రసంగం టీడీపీ కరపత్రంలా ఉంది
– కేంద్రం వల్లనే ఏపీ అభివృద్ధికాలేదంటున్నారు
– నాలుగేళ్లు కేంద్రంతో సంసారం చేసింది టీడీపీ కాదా?
– పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చి ప్రజల్ని మోసంచేస్తున్నారు
– విలేకరుల సమావేశంలో వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి
హైదరాబాద్‌, జనవరి30(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ నర్సింహన్‌ చేత ప్రభుత్వం అన్ని అబద్దాలు చదివించిందని, ఆయన ప్రసంగం కేవలం కరపత్రమని వైసీపీ నాయకుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.  వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగంలో సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని చెప్పించారని, అంటే అసెంబ్లీ దెయ్యాల కొంపనా అని ప్రశ్నించారు. 23మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వ తీరుతో అసెంబ్లీని దెయ్యాల కొంపగా భావించాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని కోడెల శివప్రసాద్‌ కాలరాస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఆహ్వానించినా రావడం లేదని ఆయన దొంగమాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కండువాలు కప్పుకొని కోడెల టీడీపీ సభల్లో పాల్గొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్టాన్ని విడదీసింది కాంగ్రెస్‌ పార్టీ… విభజన ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించాల్సింది కేంద్రంలోని ఎన్డీయే అని అన్నారు. కానీ, నాలుగేళ్లు ఎన్డీయేతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు గవర్నర్‌ ప్రసంగంలో..  కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పించడం దారుణం అన్నారు. ‘జపాన్‌, సింగపూర్‌ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్‌ చెప్పారని, జాతీయ సగటు కన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువని అన్నారు. 55 శాతం వృద్ధి పెరిగినట్లు పేర్కొన్నారు. నిజంగా వృద్ధి పెరిగినట్టు నిరూపించగలరా’ అని సవాల్‌ విసిరారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా శ్వేత పత్రాలు, కొత్త హావిూలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చేతగాని ప్రభుత్వం.. చేతగాని బడ్జెట్‌ ప్రవేశపెడుతోందని విమర్శించారు. నాడు హంద్రీనీవా అవసరమే లేదన్న చంద్రబాబు.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమండ్‌ చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా, గాలేరు పనులు జరిగాయని గుర్తుచేశారు. ఆ మహానేత చెమట చుక్కల ఫలితంగానే రాయలసీమకు నీళ్లొచ్చాయని అన్నారు.