గీత కథలో కొత్త మలుపులు తిరుగుతోంది

41mdnabz కరాచీ: పాకిస్తాన్‌లో 14 ఏళ్లుగా అజ్ఞాత వాసంలో ఉన్న గీత కథ.. ఓ కొలిక్కి వస్తుందనుకున్న తరుణంలో.. కొత్త మలుపులు తిరుగుతోంది. గీతను బిహార్‌లోని ఆమె కుటుంబ సభ్యులతో స్కైప్ (వీడియో కాలింగ్)లో మాట్లాడిస్తే.. వారిని చూసి వీళ్లే కుటుంబ సభ్యులేనని గుర్తించింది.

అయితే ఈ సమయంలోనే గీతకు మైనర్‌గా ఉన్నప్పుడే ఉమేశ్ అనే వ్యక్తితో పెళ్లైందని.. వారికి ఓ బాబు కూడా ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. తనకు అసలు పెళ్లి కాలేదని గీత అంటోంది. దీనికి తోడు తప్పిపోకముందు దిగిన ఓ బాలిక ఫొటోను చూపించినా ఇది తనది కాదని తెలిపింది. దీంతో కథ ముగింపుకు వస్తున్న తరుణంలో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయని.. ఈది ఫౌండేషన్ నిర్వాహకుడు ఫైజల్ ఈది తెలిపారు. గీత తమదగ్గర ఏమైనా దాస్తోందా లేక.. తప్పుదారి పట్టిస్తోందా అనే విషయాలు ఆమెతో మాట్లాడాకే నిర్ధారిస్తామన్నారు. కాగా, అక్టోబర్ 26న గీతతోపాటు ఈది కుటుంబ సభ్యులు భారత్ వస్తున్నారు. అయితే.. గీత కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాకే అప్పగిస్తారని.. పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్ టీసీఏ రాఘవన్ తెలిపారు.