గుంటూరులో విషాదం
– ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
– బాధితురాలిని ఆస్పత్రికి తరలింపు
– మాచర్ల బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన స్థానికులు
– పరారీలో నిందితుడు జయరాజ్
గుంటూరు, జనవరి30(జనంసాక్షి) : దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు పసివాళ్లను వదలడం లేదు. కన్నబిడ్డ వయసున్న అభం శుభం తెలియని ఆడబిడ్డలను చిదిమేస్తున్నారు. గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. రెంటచింతల మండలం తుమురుకోటలో జయరాజ్ అనే యువకుడు ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. జయరాజ్ మద్యం మత్తులో పాపకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తర్వాత ఏం జరిగిందని ఆరా తీస్తే జయరాజ్ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో అతడ్ని పట్టుకోవడానికి ఇంటికి వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి బంధువులతో పాటూ స్థానికులు మాచర్ల బస్టాండ్ దగ్గర ఆందోళనకు దిగారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు ఆందోళన విరమించాలని కోరినా శాంతించ లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.