గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుదాం
– రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉంది
– బేధాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేయండి
– పొత్తు, అభ్యర్థుల ఎంపికపై ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దు
– తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ దిశానిర్దేశం
– మూడుగంటలపాటు రాహుల్తో చర్చలు జరిపిన నేతలు
– అభ్యర్థుల ఎంపికపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు
న్యూఢిల్లీ, సెప్టెంబర్14(జనంసాక్షి) : ‘ముందస్తు నగారా’లో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. పొత్తుల ఎత్తులు, అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్య నేతలు.. పార్టీ అధినేత రాహుల్గాంధీతో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటూ జరిగిన ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని, పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నేతలకు అభిప్రాయ బేధాలుంటే పార్టీ
వేదికగా కూర్చొని చర్చించుకోవాలని ఆదేశించారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించుదామని, ఆమేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పొత్తులు, సీట్ల సర్ధుబాట్ల అంశంపై కూడా చర్చించిన రాహుల్, పొత్తు, అభ్యర్థుల ఎంపికపై ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దని నేతలను ఆదేశించారు. ఎవరు నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని రాహుల్ హెచ్చరించినట్లు సమాచారం. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ గెలిపించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పొత్తులతో వెళ్తే టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవచ్చునని రాష్ట్ర నేతలు సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్తో కలిసొచ్చే పార్టీలతో పొత్తుకు అవకాశం ఉంటే పెట్టుకోండని, సీట్ల కేటాయింపులో కాంగ్రెస్లోని గెలుపుగుర్రాలకు ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. అందరూ ఐక్యంగా ముందుకు సాగి తెలంగాణలో రాష్ట్రం గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తాలని రాహుల్ ఆదేశించినట్లు తెలుస్తుంది.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు ..
అలాగే ఎన్నికల కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నేత భక్తచరణ్దాస్ ఛైర్మన్గా జ్యోతిమణి సెంథిమలై, శర్మిష్ట ముఖర్జీతో కమిటీని నియమించారు. వీరు సీట్ల సర్థుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టనున్నారు. ఈకమిటీలో ఉన్న శర్మిష్ట ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ఉన్నారు.
రాహుల్తో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ ..
అదేవిధంగా మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ రాహుల్తో 15 నిమిషాల పాటూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడితో చర్చించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగిందని రాహుల్కు వివరించినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ కోసం పనిచేసిన నేతలు, యువతకు టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ భేటీ ముగిశాక మాట్లాడిన కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధినేత సూచించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆవశ్యకతను ప్రజలకు తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారన్నారు.