గ్రామాల అభివృద్దికి కేంద్రం నిధులు రావాల్సిందే

విడుదలలో జాప్యంతో పడని అడుగు

అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయం అవసరం కాగా, ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించినప్పటికీ వాటికి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. తద్వారా పనులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పట్టణ తరహా గ్రావిూణాభివృద్ధి (రూర్బన్‌) కార్యక్రమం కోసం 2015-16లో రాష్ట్రంలోని విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అయిదు పంచాయతీలను ఎంపిక చేశారు. రూ.135 కోట్లతో ఆయా గ్రామాల్లో వివిధ పనుల నిర్వహణకు వీలుగా కార్యాచరణ రూపొందించారు. ఇందులో కేంద్రం 60శాతం, రాష్ట్రం మిగతా 40 శాతం

నిధులు సమకూర్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ పనులు రెండేళ్లయినా పూర్తి చేయని పరిస్థితి నెలకొంది. రెండో విడత మరో ఆరు జిల్లాల్లో రూ.180 కోట్లతో పనుల నిర్వహణకు అనుమతులిచ్చారు. నిధులు గడువులోగా ఖర్చు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. కేంద్రం కూడా నిధులు సకాలంలో విడుదల చేయాలి.పంచాయతీల్లో పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన ఒక పరిశీలనలో వెల్లడైంది. కొత్త భవనాలకు ఆస్తి పన్ను విధింపు, ఉన్న పన్నులను ప్రతి అయిదేళ్లకోసారి సవరించాలన్న ఆదేశాలు పంచాయతీల్లో అమలుకు నోచుకోవడం లేదు. ఆర్థిక సంఘ నిధులు, దస్తావేజుల రిజిస్టేష్రన్లపై వచ్చే స్టాంపు డ్యూటీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లతోనే అత్యధిక పంచాయతీలు సరిపెట్టుకుంటున్నాయి. కేరళ, కర్ణాటక వంటి రాష్టాల్లో పంచాయతీలు ఆర్థికంగా

బలోపేతంగా ఉన్నాయంటే పన్నుల వ్యవస్థ పటిష్ఠంగా ఉండటమే ప్రధాన కారణమని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలోని 12,918 పంచాయతీలకు ఆస్తి పన్ను, పన్నేతర రుసుముల కింద ఏటా రూ.732కోట్లకుపైగా ఆదాయం వస్తున్నట్లు గణాంకాలున్నాయి. కానీ, 50శాతంనుంచి 60శాతానికి మించి అందులో వసూలు కావడం లేదు. పాలకవర్గాలు పట్టించుకోకపోవడం, ప్రజల సహకారం కొరవడటమే ఇందుకు కారణం అని భావిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రావిూణ ప్రాంతాల్లో ఇప్పటికే 32 లక్షల కుటుంబాల కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. త్వరగా నిర్మాణాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇళ్ల నుంచి చెత్తతోపాటు పశువుల పేడనూ సేకరించి వాటి ద్వారా ఏటా రూ.600 కోట్ల సంపద సృష్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. పన్నేతర రుసుము వసూళ్లు, అందులోని లొసుగులను సవరిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఆ దిశగా గ్రామ పంచాయతీలు దృష్టి సారించడం లేదు. రెండు జిల్లాలను ఇప్పటికే బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా 11 జిల్లాలపైనా దృష్టి పెట్టింది. భారీగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నా వాటి నిర్వహణ చాలా జిల్లాల్లో అధ్వానంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మిషన్‌ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2,584 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా ఇతర ప్రభుత్వశాఖలను అనుసంధానించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేస్తే మరిన్ని ఫలితాలు సాధించొచ్చని భావిస్తున్నారు. దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫైబర్‌ గ్రిడ్‌ సంస్థను ఏర్పాటుచేశారు. దాని ద్వారా నెలకు రూ.150లకే ఇంటర్నెట్‌, కేబుల్‌, టెలిఫోన్‌ సదుపాయాన్ని మారుమూల పల్లెలకు అందించడం సమాచార రంగంలో ఓ విప్లవంగా చూడాలి. సాంకేతిక పరిజ్ఞానంతో వైర్లు వేయడానికి అవకాశం లేని గ్రామాలకు వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పిస్తున్నారు. 20 కిలోవిూటర్ల పరిధిలో దీని ద్వారా 20 జీబీపీఎస్‌ వేగంతో ఈ సౌకర్యం కల్పించవచ్చు.ఈ సేవలను రాష్ట్రంలోని పంచాయతీలన్నింటికీ అందుబాటులో తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.