చరిత్ర సృష్టించిన మేరీకోమ్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్వర్ణం
న్యూఢిల్లీ,నవంబర్24(జనంసాక్షి): భారత బాక్సింగ్ దిగ్గజ క్రీడాకారిణి మేరీకోమ్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో 48కిలోల విభాగంలో ఉక్రేయిన్ బాక్సర్ హన్నా ఓఖోటాతో జరిగిన పోరులో 5-0తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఆమెకిది ఆరో స్వర్ణం కావడం విశేషం. మేరి చివరి సారిగా 48 కిలోల విభాగంలో 2010లో ప్రపంచ బాక్సింగ్లో స్వర్ణం గెలిచింది. ఈ పోటీకి ముందు ఆమె ఐర్లాండ్ బాక్సర్ కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో పతకాల పరంగా సమంగా ఉంది. అయితే తాజాగా విజయంతో మహిళల బాక్సింగ్ చరిత్రలోనే అత్యధికంగా ఆరు స్వర్ణాలు(2002,05,06,08,10,18) గెలుచుకున్న క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు బాక్సింగ్కు దూరంగా ఉన్న మేరీ 2018 గోల్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. అంతకు ముందు రియో ఒలింపిక్స్ కోసం పోటీపడ్డా అర్హత పోటీల్లో ఓడిపోయింది. దీంతో ఆమె కెరీర్ ముగిసినట్టేనని అందరూ అనుకున్నారు. పట్టువదలని ఆమె తిరిగి కఠోర సాధన చేసి పుంజుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 35 ఏళ్లు. ముగ్గురు పిల్లలు. రాజ్యసభ సభ్యురాలు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ బాక్సింగ్లో దూసుకుపోతుండటం మరో విశేషం.