ఛత్తీస్‌ఘడ్‌లో దారుణ దృశ్యం


` కూతురు శవంతో పది కిలోవిూటర్లు నడిచిన తండ్రి
` ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
రాయ్‌పూర్‌,మార్చి 26(జనంసాక్షి):ఓ తండ్రి తన కుమార్తె శవాన్ని భుజాలపై వేసుకుని దాదాపు పదికిలోవిూటర్లు పరుగెత్తిన హృదయ విదారక ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో జరిగింది. కూతరు మృతదేహాన్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించక పోవడంతో ఆయన విధిలేక నడక చేపట్టాడు. ఛత్తీస్‌గఢ్‌, సుర్గుజ జిల్లాలోని అమ్‌దల గ్రామస్థుడు ఈశ్వర్‌ దాస్‌ అనుభవించిన వెతలను తెలుసుకుంటే హృదయం ద్రవిస్తుంది. ఆయన తన ఏడేళ్ళ కుమార్తె మృతదేహాన్ని 10 కిలోవిూటర్ల మేరకు తన భుజాలపై మోసుకెళ్ళవలసి రావడం అత్యంత దురదృష్టకరం. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సింగ్‌ దేవ్‌ ఆదేశించారు. ఈశ్వర్‌ దాస్‌ కుమార్తె సురేఖ తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను శుక్రవారం ఉదయం లఖన్‌పూర్‌ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు. ఆమె ఆక్సిజన్‌ లెవెల్స్‌ దాదాపు 60కి పడిపోయాయి. ఈ కేంద్రంలో పని చేస్తున్న రూరల్‌ మెడికల్‌ అసిస్టెంట్‌ (ఆర్‌ఎంఏ) డాక్టర్‌ వినోద్‌ భార్గవ్‌ మాట్లాడుతూ, అవసరమైన చికిత్స చేసినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదని, మరింత క్షీణించిందని చెప్పారు. ఆమె తుదిశ్వాస విడిచిందని తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు వాహనం వస్తుందని చెప్పామని, ఉదయం 9.20 గంటలకు ఆ వాహనం వచ్చిందని, అప్పటికే ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకుని వెళ్ళిపోయారని చెప్పారు. ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై మోసుకుంటూ సుమారు 10 కిలోవిూటర్లు ప్రయాణించి, తన స్వగ్రామానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవడంతో ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ దర్యాప్తుకు ఆదేశించారు. అంబికాపూర్‌ జిల్లా చీఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్‌కు దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. ఈశ్వర్‌ దాస్‌ తన కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి బదులు వాహనం వచ్చే వరకు వేచి చూసే విధంగా లఖన్‌పూర్‌లోని సంబంధిత వైద్యాధికారి నచ్చజెప్పి ఉండవలసిందన్నారు.