జనవరిలోగా కేంద్ర ఎన్నికలకు అవకాశం లేదు: ఇసి
న్యూఢిల్లీ,సెప్టెంబర్6(జనంసాక్షి): 2019 జనవరి 31 వరకు లోక్సభ ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆ తర్వాతే ప్రకటిస్తామని తేల్చి చెప్పింది. లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిపితే తమ అసెంబ్లీకి కూడా వాటితో పాటు ముందస్తు ఎన్నికలు జరపాలని ఒడిస్సా అధికార పార్టీ బీజేడీ ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం పై వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు అవసరమైన ఈవిఎంలు, వివిప్యాట్లు నవంబర్ 30, 2018కి తమకు అందుబాటులోకి వస్తాయని ఇసి పేర్కొంది. అనంతరం మరో రెండు మూడు నెలలు ఓటర్ల జాబితాకు సంబంధించిన మార్పులుచేర్పులు ఉంటాయని, అందువల్ల జనవరి 2019లోపు లోక్సభ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని బీజేడీకి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.