జయశంకర్ సార్కు ఆశయాల మేరకు నడుచుకుంటున్న కెసిఆర్
వరంగల్,ఆగస్ట్6(జనం సాక్షి ): ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా పలువురు నివాళి అర్పించారు. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ యాదిలో ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కోసం తన జీవితమంతా పాటుపడ్డారన్నారు. ఆంధ్రను, తెలంగాణను కలుపొద్దు అని ఎస్ఆర్సీ, ఫజల్ అలీ కమిషన్ ముందు మొదట వ్యతిరేకించిన వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. విశాలాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా గళమెత్తింది ప్రొఫెసర్ జయశంకర్ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ మలి ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషి చాలా గొప్పదన్నారు. దురదృష్టవశాత్తు కొట్లాడి సాధించు కున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన మన మధ్య లేకుండా పోయారు. తెలంగాణ వచ్చాక ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని జయశంకర్ సార్ ఆశించారో నేడు సీఎం కేసీఆర్ సమర్ధ నాయకత్వంలో అవే పథకాలు అమలు అవుతున్నాయని కడియం గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కరెంట్ కోసం మనం చాలా గోస పడ్డాము. రైతులు ఆందోళన చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ తెలంగాణ వచ్చాక మొదటి సంవత్సరంలోనే కోతలు లేని కరెంట్ ఇచ్చాము. ఆ తరవాత ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున ఏటా 8 వేల రూపాయలను, మొత్తంగా 12 వేల కోట్ల రూపాయలను ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. కోట్ల మొక్కలను హరితహారంలో భాగంగా నాటి హరిత తెలంగాణ సృష్టించే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికున్నపుడు ఏమైతే చేయాలని అనుకున్నారో నేడు సీఎం కేసీఆర్ అవన్నీ అమలు చేస్తున్నారు. జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేటలో 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని మిగిలిన అన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తాం.. అని మంత్రి కడియం అన్నారు. వినయ్ భాస్కర్ , మేయర్ నరేందర్ తదితరులు నివాళి అర్పించారు.