టీ20 ర్యాంకింగ్స్‌లో..  రోహిత్‌, కుల్దీప్‌ పైపైకి..!


ముంబయి, నవంబర్‌12(జ‌నంసాక్షి) : వెస్టిండీస్‌ని మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత క్రికెటర్లు..  సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ బౌలింగ్‌
ప్రదర్శన కనబర్చి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన కుల్దీప్‌ యాదవ్‌ ఏకంగా14స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌ని అందుకోగా.. కెరీర్‌లో 4వ టీ20 శతకం బాదిన రోహిత్‌ శర్మ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. ఇక ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో 92 పరుగులు చేసిన శిఖర్‌ ధావన్‌ ఐదు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌ని అందుకున్నాడు. టీ20 సిరీస్‌లో విఫలమైనా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాప్‌-5లో చోటు నిలబెట్టుకోగా, రోహిత్‌కి పగ్గాలప్పగించి రెస్ట్‌ తీసుకున్న రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 15వ స్థానానికి పడిపోయాడు. ఇక తొలిరెండు టీ20ల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమై ఆఖరి టీ20లో అవకాశం దక్కించుకున్న మణికట్టు స్పిన్నర్‌ చాహల్‌ రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా టాప్‌-5లో చోటు నిలబెట్టుకున్నాడు. భువనేశ్వర్‌, బుమ్రా వరుసగా 20, 21వ స్థానాల్లో నిలిచారు.
టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ జట్టు 126 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 138 పాయింట్లతో పాకిస్థాన్‌ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. భారత్‌ చేతిలో 0-3 తేడాతో ఓడిన వెస్టిండీస్‌ ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది.