ట్విటర్ సీఈఓపై.. చర్యలు తీసుకుంటాం
– కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ, నవంబర్21(జనంసాక్షి): బ్రాహ్మణవాద పితృస్వామ్యాన్ని నాశనం చేయాలని చెప్తున్న కరపత్రాన్ని ప్రదర్శించిన ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీపై చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర ¬ం మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం తెలిపారు. తాము ఇప్పటికే ట్విటర్తోనూ, జాక్ డోర్సీతోనూ మాట్లాడినట్లు తెలిపారు.
జాక్ డోర్సీ పట్టుకున్న కరపత్రం బ్రాహ్మణ వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జాక్పై విమర్శలు గుప్పిస్తున్నారు. నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో ట్విటర్ మంగళవారం క్షమాపణ చెప్పింది. ట్విటర్ లేదా ఆ సంస్థ సీఈఓ అభిప్రాయాలను ఈ కరపత్రం ప్రతిబింబించదని స్పష్టం చేసింది. జాక్ డోర్సీ గత వారం భారతదేశానికి వచ్చారు. ఆరుగురు పాత్రికేయురాళ్ళతో ఆయన ఈ ఫొటో దిగారు. ఈ ఫొటోను ఓ పాత్రికేయురాలు ట్వీట్ చేశారు.
ట్విటర్ సీఈఓకు మద్దతివ్వలేదు – మనీష్ తివారీ
బ్రాహ్మణవాద పితృస్వామ్యాన్ని నాశనం చేయాలని చెప్తున్న కరపత్రాన్ని పట్టుకున్న ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీకి తాను మద్దతివ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ స్పష్టం చేశారు. జాక్ డోర్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనీష్ ఇచ్చిన ఓ ట్వీట్లో ట్విటర్ సృష్టికర్తను నిందించడం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. భారతీయ రాజకీయాల్లో బ్రాహ్మణవాద వ్యతిరేకత నిజమేనని పేర్కొన్నారు. భారతీయ రాజకీయాల్లో మండలీకరణ అనంతరం ఇది మరింత ప్రముఖంగా కనిపించిందని తెలిపారు. మనం భారతదేశపు కొత్త యూదులమని, దీనితో కలిసి జీవించడం నేర్చుకోవాలని పేర్కొన్నారు.
ట్వీట్పై ఆరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్ దాస్ పాయ్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మనీష్ తివారీ తన వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ మరో ట్వీట్ చేశారు. ఇతర కులాలను వ్యతిరేకించడం ఏవిధంగా తప్పు అవుతుందో, అదేవిధంగా బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించడం కూడా తప్పు అవుతుందని మనీష్ తివారీ పేర్కొన్నారు. ట్విటర్ సీఈఓ చేసినది పూర్తిగా అవాంఛనీయమన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. మన ఆచార, సంప్రదాయాల్లోని ప్రమాదకర ధోరణులు పెరుగుతుండటాన్ని మాత్రమే తాను వెల్లడించానని తెలిపారు.