ఢిల్లీలో అగ్నిప్రమాదం..


– నలుగురి మృతి, మరొకరికి గాయాలు
న్యూఢిల్లీ, నవంబర్‌19(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని కరోల్‌భాగ్‌ ప్రాంతంలో ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అరగంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీ సిబ్బంది ఓ ద్రావణంతో స్టీమ్‌ ప్రెస్సింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుస్తులు స్టీమ్‌ ప్రెస్సింగ్‌ చేసే కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరూ కార్మికులు అని పోలీసులు వెల్లడించారు. మృతులు బగన్‌ ప్రసాద్‌(55), ఆర్‌ఎం నరేష్‌(40), ఆర్తి(20), ఆశా(40)లుగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.