ఢిల్లీలో జంట హత్యల కలకలం

జీతం కోసమే హత్య చేసినట్లుగా గుర్తింపు

న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జంట హత్యలు కలకలం రేపాయి. వసంత్‌ కుంజ్‌లో ఒకే ఇంట్లో ఇద్దరిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.

నగరంలోని వసంత్‌కుంజ్‌ ఎన్‌క్లేవ్‌లో 53ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌, ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తి హత్యకు గురయ్యారు. మలా లఖనీ అనే మహిళ గ్రీన్‌ పార్క్‌ ప్రాంతంలో బొటిక్‌ నడుపుతారు. గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో మలా ఇంటి తలుపు తెరిచి ఉండడం, గేటు దగ్గర ఉండాల్సిన సెక్యురిటీ గార్డు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికలు పోలీసులకు ఫోన్‌ చేశారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మలా లఖనీ, సెక్యూరిటీగార్డు బహదూర్‌ సింగ్‌(42) రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇద్దరినీ దుండగులు పదునైన ఆయుధాలతో పొడిచి చంపేశారు. మలా శరీరంపై దాదాపు పది సార్లు పొడిచిన గాయాలున్నాయి, ఆమె మృతదేహం బెడ్‌రూంలో పడి ఉండగా, బహదూర్‌ మృతదేహం లివింగ్‌ రూంలో ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మలా వద్ద పనిచేసే ముగ్గరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొన్నారు. ఆమె జీతం సమయానికి ఇవ్వడం లేదని వారు గొడవపడి పొడిచి చంపేశారని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. జీతం ఇవ్వకపోవడంతో నిందితులు దోపిడీ చేయడంతోపాటు ఆమెను చంపేయాలని అనుకున్నట్లు చెప్పారని తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు