ఢిల్లీ సిఎం కేజ్రీవాల్పై కారంపొడితో దాడి
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ,నవంబర్20(జనంసాక్షి): ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్పై దారుణమైన దాడి జరిగింది. ఆయన ముఖంపై ఓ వ్యక్తి కారంపొడితో దాడి చేశాడు. కేజీవ్రాల్ను చంపేస్తానంటూ గట్టిగా అరిచాడు. తోపులాటలో కేజీవ్రాల్ కళ్లజోడు నేలపై పడిపోయింది. ఢిల్లీ సెక్రటేరియట్లోని మూడో అంతస్తులో మంగళవారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. సీఎంపై అనూహ్యమైన దాడి ఢిల్లీలో కలకలం రేపింది. దాడికి పాల్పడ్డ నిందితుడిని అనిల్ కుమార్గా గుర్తించారు. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సీఎం అరవింద్ కేజీవ్రాల్ మధ్యాహ్న భోజనానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నిందితుడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెక్రటేరియట్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. సెక్రటేరియట్ మూడో ఫ్లోర్లో కేజీవ్రాల్ కార్యాలయం బయట వేచి చూసిన నిందితుడు.. ఆయన బయటకి రాగానే కారంపొడితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామానికి సీఎం షాక్ తిన్నారు. నిందితుడు అనిల్ కుమార్ ఓ సిగరెట్ పెట్టెలో కారంపొడిని తీసుకొని సెక్రటేరియట్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అతడు ఈ దాడి చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెక్రటేరియట్లో సాక్షాత్తూ సీఎంపైనే దాడి జరగడం సంచలనంగా మారింది. ఇది కచ్చితంగా ఢిల్లీ పోలీసుల వైఫల్యమేనని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు. దీన్ని ప్రమాదకరమైన దాడిగా పేర్కొన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఎలా అని ట్విటర్ ద్వారా వారు ప్రశ్నించారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో కనుక్కోవాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వ్యక్తి నరైనా ప్రాంతానికి చెందిన అనిల్ శర్మగా గుర్తించారు. ఈ దాడితో సచివాలయంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కేజీవ్రాల్ కళ్లద్దాలు కూడా విరిగిపోయాయి. అత్యంత భద్రత ఉండాల్సిన సెక్రటేరియట్లో ఈ దాడి జరగడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసులపై మండి పడింది. కేజీవ్రాల్పై దాడి చేసిన తర్వాత సదరు అనిల్ శర్మ.. నిన్ను కాల్చి చంపుతాను అంటూ హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గతంలో తన ఫేస్బుక్ పోస్ట్లోనూ అతడు ఇవే హెచ్చరికలు జారీ చేశారు. కేజీవ్రాల్పై ఇలాంటి దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. 2016లో ఓ మహిళ ఆయనపై ఇంకు చల్లగా, తర్వాత నాలుగు నెలలకు మరో వ్యక్తి షూ విసిరాడు.