తండాల అభివృద్దికి పూర్తి సహకారం

జనగామ,జూన్‌29(జనం సాక్షి ): పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్‌ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానన్నారు. సమైక్య పాలనలో పూర్తిగా వివక్షతకు గురైన గిరిజన తండాలను అభివృద్ధి పర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. గిరిజన తండాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు ప్రతి గిరిజన తండా రోడ్డు సౌకర్యం కల్పిస్తానన్నారు. నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో నిరంతరంగా నీళ్లు పారేలా కృషి చేయడమే తన ధ్యేయమని అన్నారు. గోదావరి జలాలతో పాలకుర్తిని సస్యశ్యామలం చేస్తానని హావిూ ఇచ్చారు. కాల్వల పేరుతో కాంగ్రెస్‌ నేతలు దోచుకుతిన్నారని మండిపడ్డారు. సాగు, తాగు నీరందించేందుకు నిరంతరం కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. తండాలు శివారు ప్రాంతాల వరకు రహదారుల సౌకర్యం ఉంటేనే వారి జీవన పరిస్థితులు మెరుగు పడుతాయని అందుకోసం ప్రభుత్వం ప్రతి తండాకు, శివారు ప్రాంతాలకు పక్కా రహదారుల సదుపాయం కోసం రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. వల్మిడి, మంచుప్పుల నుంచి పాకాల వరకు బీటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తాన్నారు. నెల రోజులో అన్నీ గ్రామాలతో పాటు ప్రతి గిరిజన తండాకు ఇంటింటికి నల్లానీరు సౌకర్యం కల్పిస్తానన్నారు.