తగ్గుతూ వస్తోన్న పెట్రో ధరలు
న్యూఢిల్లీ,నవంబర్13(జనంసాక్షి): పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల మంగళవారం కూడా కొనసాగింది. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ, దాదాపు మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో.. మంగళవారం లీటరు పెట్రోలుపై 13 పైసలు, డీజిల్ పై 12 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 77.43 కు తగ్గగా, డీజిల్ ధర రూ. 72.19 కి చేరింది. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 82.94 కు, డీజిల్ ధర రూ. 75.64కు చేరుకుంది. కర్నాటక ఎన్నికల సమయంలో మూడు వారాల పాటు పెట్రోలు, డీజిల్ ధరలు మారకుండా ఉన్నాయి. ఆ తరువాత వరుసగా పెరుగుతూ వచ్చిన ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి వెళ్లాయి. ఆ పై అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు తగ్గు ముఖం పట్టాయి. గత వారంలో చమురు ఉత్పత్తిని 10 లక్షల బ్యారళ్లు కుదిస్తున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించగా, ఆ వెంటనే క్రూడాయిల్ పై ఒత్తిడి పెరిగి, ధరలు తిరిగి పెరగడం ప్రారంభమైంది. ఇండియాపై మాత్రం ఆ ప్రభావం ఇంకా కనిపించడం లేదు.