తగ్గుబాటలో పసిడి
న్యూఢిల్లీ,నవంబర్14(జనంసాక్షి): పండగ సీజన్లో ఆరేళ్ల గరిష్ఠానికి చేరువగా వెళ్లిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయం పరిస్థితుల కారణంగా బంగారం ధర రూ.32వేల దిగువకు వచ్చింది. బుధవారం రూ.150 తగ్గడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,900కి చేరింది. స్థానిక నగల వర్తకుల నుంచి డిమాండ్ లేమి కారణంగా బంగారం ధర తగ్గుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అటు అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గింది. బంగారం ధర 0.08శాతం తగ్గడంతో సింగపూర్ మార్కెట్లో ఔన్సు 1,201.90 డాలర్లు పలికింది. ఇదిలా ఉంటే వెండి మాత్రం స్తబ్ధుగా ఉంది. కిలో వెండి ధర రూ.37,450గా నమోదైంది. నిన్న ఒక్క రోజే వెండి ధర రూ.700 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 99.9శాతం బంగారం ధర రూ.31,900గా ఉండగా, 99.5శాతం పసిడి రూ.31,750 పలుకుతోంది. నిన్నటి ట్రేడింగ్లో బంగారం ధర రూ.100 తగ్గింది.