తన బదిలీ నిర్ణయాన్ని రద్దుచేయండి
– సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన సీబీఐ అధికారి
– పిటీషన్ అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్19(జనంసాక్షి) : సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి మనీష్ కుమార్ సిన్హా సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఉన్నపళంగా మహారాష్ట్రలోని నాగ్పూర్కు తనను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనాన్నికోరారు. అయితే అత్యవసరంగా విచారించాల్సిన అవసరమేంటని ధర్మాసనం ప్రశ్నించడంతో… తన వద్ద సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురించి ‘షాకింగ్ డాక్యుమెంట్లు’ ఉన్నాయంటూ చెప్పారు. అయితే ఈ విషయం తమను అంత ‘షాకింగ్కు గురిచేయడం లేదు అంటూ అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరించింది. ఇటీవల సీబీఐలో పెను మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వివాదాల కారణంగా సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాను కేంద్రం సెలవుపై పంపించింది. తాత్కాలిక డైరెక్టర్గా మన్నెం నాగేశ్వరరావును నియమించింది. కాగా.. బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటలకే మన్నెం నాగేశ్వరరావు.. ప్రజాప్రయోజనం దృష్ట్యా సీబీఐలో 13 మంది అధికారులను తక్షణమే బదిలీ చేశారు. వీరిలో మనీశ్ కుమార్ సిన్హా కూడా ఉన్నారు. ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న బృందంలో ఒకరైన మనీశ్ను నాగ్పూర్కు బదిలీ చేశారు. ఈ బదిలీని సవాల్ చేస్తూ మనీశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను సెలవుపై పంపడాన్ని వ్యతిరేకిస్తూ సీబీఐ డెరెక్టర్ ఆలోక్ వర్మ వేసిన పిటిషన్ను న్యాయస్థానం ప్రస్తుతం విచారిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై మరోసారి విచారణ చేపట్టనుంది. ఈ విచారణతో పాటే తన పిటిషన్పై కూడా అత్యవసరంగా విచారణ జరపాలని మనీశ్ కోర్టును కోరారు. అయితే ఇందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్పై అంత అత్యవసరంగా విచారణ జరపాల్సింది ఏముంది అని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇందుకు మనీశ్ బదులిస్తూ.. ఆలోక్వర్మకు సంబంధించి షాకింగ్ డాక్యుమెంట్లు
తనవద్ద ఉన్నాయని చెప్పారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్పందిస్తూ.. ‘మమ్మల్ని ఏదీ షాక్కు గురిచేయదు అని అన్నారు.