తీరప్రాంత వాసుల తుపాను రక్షణ ప్రాజెక్టు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో తీరప్రాంత వాసుల తుపాను కష్టాలను తొలగించడానికి రూ.792 కోట్లతో భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి ముళ్లపల్లి రామచంద్రన్‌ వెల్లడించారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు 12,640 హెక్టార్ల భూభాగానికి రక్షణ కల్పిస్తుందని, 5.50 లక్షల మందికి లబ్ది చేకూర్చుతుందని చెప్పారు. 13వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రాష్ట్ర వైపరీత్య స్పందననిధి కింద ఆంధ్రప్రదేశ్‌కు 2010-11 నుంచి 2014-15 మధ్యకాలంలో రూ.2811.64 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిలో 75 శాతం మొతాన్ని కేంద్రమే సమాకూరుస్తుందని వెల్లడించారు.