తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి విహారం

తిరుపతి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం సాయంత్రం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రాత్రి  స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా శుక్రవారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.