తెలంగాణలో మరో రెండు భారీ పెట్టుబడులు

700 కోట్ల పెట్టుబడులకు లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్‌ అంగీకారం
మంత్రి కెటిఆర్‌తో భేటీ…పెట్టుబడులపై చర్చ
హైదరాబాద్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరానికి మరో రెండు భారీ పెట్టుబడులు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రగతి భవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీల ప్రతినిధులు కలిశారు. జినోమ్‌ వ్యాలీలో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రెండు కంపెనీలు వెల్లడించాయి. మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల కోసం గ్రాన్యూల్స్‌ ఇండియా రూ. 400 కోట్లు, లారస్‌ ల్యాబ్స్‌ రూ. 300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ కంపెనీల పెట్టుబడుల ద్వారా 1750 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ రెండు కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌.. అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తుందని హావిూ ఇచ్చారు. /ూష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీలను మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. రెండు కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. తెలంగాణ అనేక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు కొనసాగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు కలిగి ఉండటమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాల వలన ఐటీ, ఫార్మా, టెక్స్‌ టైల్స్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌తో పాటు ఇతర రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, ఈ రోజు తెలంగాణకు రానున్న ఈ రెండు పెట్టుబడుల ద్వారా తయారీ రంగంలో పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన గ్రాన్యూల్స్‌ ఇండియా రూ. 400 కోట్ల పెట్టుబడితో 10 బిలియన్‌ ఫినిష్డ్‌ డోసులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 16 వందల మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రాన్యూల్స్‌ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో తయారీ యూనిట్లను కలిగి ఉంది. మొత్తం 75 దేశాల్లో తమ కార్యకలాపా లను కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్‌ ఫార్మాస్యూటికల్‌ ఫార్ములేషన్‌ ఇంటర్మీడియట్‌ యూనిట్‌ ని హైదరాబాద్‌ కి దగ్గర్లో ఉన్న గాగిల్లాపూర్‌ వద్ద కలిగి ఉన్నది. తమ కంపెనీకి సంబంధించిన పెట్టుబడిని అధికారికంగా ప్రకటించేందుకు కంపెనీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణప్రసాద్‌ ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్‌ కలిశారు. లారస్‌ ల్యాబ్స్‌ కు సంబంధించిన రూ. 300 కోట్ల పెట్టుబడులు రెండు దఫాలుగా ఉంటాయని ఆ సంస్థ సీఈవో సత్యనారాయణ చావ మంత్రి కేటీఆర్‌కు తెలియజేశారు. 5 బిలియన్‌ డోసుల కెపాసిటీ కలిగిన ఫార్ములేషన్‌ ఫెసిలిటీ యూనిట్‌ కోసం ఈ పెట్టుబడి ఉంటుందని తెలిపింది.  ఇప్పటికే లారస్‌ ల్యాబ్‌ కి జీనోమ్‌ వ్యాలీ లోని ఐకేపీ నాలేడ్జ్‌ పార్క్‌ లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ఉంది. సంస్థకు ఉన్న ఆరు ఇతర మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీస్‌ ప్రపంచంలోని అనేక దేశాల నుంచి అనుమతులు పొంది ఉన్నాయి. లారస్‌ ల్యాబ్స్‌  యాంటీ రిట్రోవైరల్‌, ఆంకాలజీ, కార్డియోవాస్క్యులర్‌,యాంటీ డయాబెటిక్స్‌, యాంటీ ఆస్తమా, గ్యాస్టో ఎంట్రాలజీ కి సంబంధించిన ఏపీఐలను తయారు చేస్తుంది.