తెలంగాణ భవన్‌ వద్ద సంబరాలు


కుట్రపూరితంగా జైలులో పెట్టారన్న నేతలు
సుప్రీంలో న్యాయం దక్కిందని వ్యాఖ్యలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు కావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని.. రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, కవితకు బెయిల్‌ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు న్యాయమే గెలిచిందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగత్తిన్నామని బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కొంత ఆలస్యమైనా న్యాయమై గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని ఆయన పేర్కొన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని అన్నారు. చివరికి న్యాయమే గెలిచింది ఎమ్మెల్సీ సుభాష్‌ రెడ్డి
అన్నారు. కవితకు బెయిల్‌ రావడం తెలంగాణ ఉద్యమకారులకు ఊపిరినిచ్చిందని మాజీ స్పీకర్‌, ఎమమెల్సీ మధుసూధనాచారి అన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని దేవీ ప్రసాద్‌ అన్నారు. కవితపై కుట్రపూరితంగా కేసుపెట్టారని ఆయన అన్నారు. తమపై ఆరోపణలు చేసినవారందరికీ ఈ తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్‌ నేతలు తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పార్టీ కార్యలయం వద్ద పలువురు సంబరాలు చేసుకునన్నారు. కవిత ఇక తిరిగి తెలంగాణ రాజకీయాల్లో పాల్గొంటారని ప్రకటించారు.