త్వరలో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` అన్ని వర్గాలకు శుభవార్త:మంత్రి హరీశ్‌
` ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్‌
` నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది..
` కేసీఆర్‌ వల్లే గజ్వేల్‌ రూపురేఖలు మారిపోయాయని వ్యాఖ్య
మెదక్‌(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని, అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన గొప్ప నాయకుడు ఆయన. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కేసీఆర్‌ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ కోసం తన ఇంటినిచ్చిన గొప్ప నాయకుడు కొండా బాపూజీ అని ప్రశంసించారు.జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ఆయన ఈ ప్రాంతం బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనని బలంగా నమ్మారని మంత్రి తెలిపారు. పద్మశాలి సమాజానికి ఆత్మగౌరవ పత్రిక కొండా లక్ష్మణ్‌ బాపూజీ. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాపూజీ సేవలకు గుర్తింపుగా తెలంగాణ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే తూప్రాన్‌ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ హయాంలో తూప్రాన్‌కు వచ్చినప్పుడు ఎటు చూసినా చెత్త చెదారంతో పందులతో అపరిశుభ్రంగా ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో పట్టణం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్‌ వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో విూరే బేరీజు వేసుకోవాలి. ఈ ఒక్క రోజే రూ. 50 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏవిూ జరగలేదని కాంగ్రెస్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.తూప్రాన్‌ అభివృద్ధి కాలేదు అంటే సూర్యుడి విూద ఉమ్మి వేసినట్టే అని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేం. ఈరోజు మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడపడచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నది. రెండు వేల రూపాయలు పెన్షన్‌ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్‌ పెద్ద కొడుకులాగా కనిపిస్తాడు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ తీసుకునే ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్‌ కనిపిస్తారని తెలిపారు.పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలని తిడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విూకు తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా? సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్‌ కావాలా? అని అడిగారు. మహిళా పక్షపాతి అయిన కేసీఆర్‌ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే విూరంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలి. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆపని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్తులో సైతం ఆసరా పెన్షన్‌ ఆగలే. కళ్యాణ లక్ష్మి ఆగలేదు అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆయన ప్రాతినిధ్యం వల్లే గజ్వేల్‌ రూపురేఖలు మారిపోయాయి. అందుకే ఆయనను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలి అని కోరారు. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దాం. అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. త్వరలోనే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నాం. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.