థానెలో కారు బీభత్సం..

– అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్నవారిని ఢీకొన్న కారు

– నలుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

థానె, నవంబర్‌17 (జ‌నంసాక్షి) : మహారాష్ట్రలోని థానె జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది.. జిల్లాలోని షహాపూర్‌లో శనివారం ఉదయం బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 16ఏళ్ల యువకుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ఉదయం ఏడు గంటల సమయంలో బాధితులు నాసిక్‌కు వెళ్లేందుకు కిహ్నావలి వంతెన వద్ద వేచి ఉండగా.. ఒక కారు వేగంగా వచ్చివారిని ఢీకొంది. ఘటన గురించి సమాచారం అందుకుని వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నలుగురు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించినట్లు వెల్లడించారు. గాయపడిన ఇద్దరు బాలికలను, ఓ జంటను షహాపూర్‌ నుంచి థానె సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే పాండురంగ్‌ బరోరా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కారు వేగంగా ఢీకొట్టడంతో కొందరు వంతెనపై నుంచి కిందపడిపోయారని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలియరాలేదు.