దత్తత గ్రామంపై కేసీఆర్ దండెత్తారు
` వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి
తుర్కపల్లి(జనంసాక్షి):యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.. అభివృద్ధి చేస్తానని చెప్పి ఆగం చేశారని విమర్శించారు.‘’ఇక్కడి ప్రజలకు నాడు ఇచ్చిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదు. రాష్ట్రానికే వాసాలమర్రిని రోల్ మోడల్ చేస్తానన్నారు. కానీ ఈ చిన్న గ్రామాన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో ప్రత్యక్షంగా చూశాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ బొమ్మలు చూపించి ఓట్లేయించుకున్నారు. ఏ గ్రామంలోనూ ఇళ్లు కట్టలేదు. భారాస ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం’’ అని పొంగులేటి అన్నారు.