దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ నానమ్మ… మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్‌ భర్త సహకారంతో హైదారాబాద్‌వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
ప్రేమ వివాహం చేసుకున్న కొడుకు సాయి 2023లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అప్పటికే సాయికి ఓ కొడుకు ఉన్నాయి. కొడుకు చనిపోయినా మనవడు ఉన్నాడని మురిసిపోకుండా సదరు నాయనమ్మ వాడిని అమ్మేసింది. దత్తత తరువాత 5లక్షలకి చిన్నారిని అమ్మేసిందంటూ కోడలు స్వప్ప పోలీసులను ఆశ్రయించింది. రఘునాథ పాలెంకి చెందిన పందుల సాయి ఖమ్మం నగరంలో నిజాంపేటకు చెందిన కొమ్మినబోయిన స్వప్న 2021 డిసెంబరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే బాబు పుట్టిన నెల రోజులకే 2023 లో సాయి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో 42 వ డివిజన్‌ కార్పోరేటర్‌ భర్త శేషగిరితో కలిసి అత్త నాగమణి తన కోడలి వద్ద నుంచి బాబును పెంచుకుంటానని తీసుకెళ్లింది. 45 రోజులకే దత్తత పేరుతో బాబును అమ్మకానికి పెట్టింది. అయితే బాబు కోసం స్వప్ప ఎంతాగానో తపించింది. తన బాబును తనకు ఇవ్వమంటూ కార్పొరేటర్‌ భర్త చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని స్వప్న ఆవేదన వ్యక్తం చేసింది. బాబును ఇవ్వమంటూ బెదరింపులకు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నా కుమారుడిని నాకు ఇప్పించండి‘ అంటూ సీసీఎస్‌ పోలీసులను స్వప్న ఆశ్రయించింది. కేసు నమోదు చేసి సీపీఎస్‌ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తును ప్రారంభించారు.