దున్న అన్నవాడే దున్నపోతు

బందర్‌ పోర్ట్‌కు సిఎం శంకుస్థాపన
వైకాపా విమర్శలపై ఘాటుగా స్పందన
విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): తనను దున్న అన్నవాడు దున్నపోతని ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్ష నేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు. గురువారం మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం అసెంబ్లీకి రాదని, పార్లమెంట్‌లో ఉండదని విమర్శించారు. ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్తున్నారని, ఇలాంటి ప్రతిపక్షం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పెన్షన్లు ఇస్తుంటే ప్రతిపక్షానికి కడుపు మండుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తయారు చేస్తామని చంద్రబాబు హావిూ ఇచ్చారు. రెండంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేశామని, అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే దొంగ జగన్‌ అని చంద్రబాబు అన్నారు. కోడి కత్తితో వైసీపీ రాజకీయ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. తనది ఉడుం పట్టని, మోదీని గ్దదె దించేవరకు వదలనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆకాశం నుంచి ఊడిపడినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసునన్నారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు రాకుండా చూసే బాధ్యత చెల్లెమ్మలదేనని చంద్రబాబు అన్నారు. మహిళలకు అన్నగా అండగా ఉంటానని, పసుపు-కుంకుమ కింద డబ్బులు ఇచ్చానని చంద్రబాబు అన్నారు. అన్నగా అండగా ఉండాలని, మనది రక్త సంబంధం కాకపోయినా పూర్వ జన్మ అనుబంధమని అన్నారు. అందుకే చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ. 20వేలు రెండు విడతలుగా పసుపు-కుంకుమ కింద ఇచ్చానని చెప్పారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణ విముక్తి చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం పనితీరును ఆయన ప్రశంసించారు.